Telangana | నిజామాబాద్/రాజన్న సిరిసిల్ల, మార్చి 17 (నమస్తే తెలంగాణ)/నస్రుల్లాబాద్: అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పెద్దమొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లాలో 3,076 మంది రైతులకు చెందిన 6,058 ఎకరాల్లో పంట నష్టం కలిగినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల్లో నష్టం జరిగినట్టు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 మంది రైతులకు చెందిన పంటలకు నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. ప్రధానంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలతోపాటు కొత్తిమీర, గోధుమ, ఉల్లి, బొప్పాయి, మామిడి, కూరగాయాల పంటలు దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు.
సిరిసిల్లలో 500 ఎకరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ము స్తాబాద్, వీర్నపల్లి, సిరిసిల్ల పట్టణంలో భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. గంభీరావుపేట మండలంలోనే ఎక్కువ నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వడగడ్ల వాన కారణంగా 500 ఎకరాల వరకు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మరో పదిహేను రోజుల్లో పంటలు చేతికి రానుండగా వడగండ్ల వాన రైతులను దెబ్బతీసింది. కాగా కరీంనగర్ జిల్లాలోని మూడు మండలాల్లో వరి, మక్క, కూరగాయ తోటలు దెబ్బతినగా, మామిడి పిందెలు నేలరాలాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలుబాక, కిష్టంపేట గ్రామాల్లో వరి, మక్కజొన్న దెబ్బతిన్నది. మానకొండూరు, గన్నేరువరం మండలాల్లో మక్క పంటకు నష్టం వాటిల్లింది.
ప్రభుత్వం ఆదుకోవాలి..
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించోల్లి, కిష్టాపూర్, అన్నారం గ్రామాల పరిధిలో కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు. పంట నష్టంపై కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టర్లకు ఫోన్ చేసి వివరించారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరారు.