స్టేషన్ ఘన్పూర్,ఫిబ్రవరి 25 : ఎస్సైగా హుందాగా జీవితం గడిపిన ఆయన ఉద్యోగ విరమణ తరువాత బెనిఫిట్స్ అందక నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన రూ.25 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించుకున్నారు. బెనిఫిట్స్ ఎప్పుడొస్తాయోనని ఎనిమిది నెలలుగా ఎదురుచూపులతో కాలం గడుపుతున్నారు. విశ్రాంత ఎస్సై సొన్నాయిల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ పరిధిలోని చాగల్లుకు చెందిన సొన్నాయిల శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈయన 36 ఏండ్లు పోలీస్ శాఖలో సేవలందించి నిరుడు జూన్ నెలలో వర్ధన్నపేట ఎస్సైగా ఉద్యోగ విరమణ పొందారు. బెనిఫిట్స్ రూ.65 లక్షలు రావాల్సి ఉన్నది. వీటి కోసం ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్నారు. శ్రీనివాస్ కాలికి ఇటీవల సెప్టిక్ కావడంతో 20 రోజుల క్రితం వైద్యులు అతడి కుడి కాలిని మోకాలి వరకు తొలగించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆరు నెలలుగా కాలు సెప్టిక్తో అవస్థ పడుతున్నారు. సుమారు రూ.25 లక్షల వరకు అప్పు చేసి చికిత్స చేయించుకున్నారు. ఎస్సైగా హూందాగా బతికిన తాను ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు. ప్రతి నెలా వచ్చే పెన్షన్లో సగానికిపైగా వడ్డీలకే సరిపోతున్నదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బెనిఫిట్స్ అందజేసి ఆదుకోవాలని కోరారు.