హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): శిక్షణ పొందిన నర్సులు అనగానే ఒకప్పుడు కేరళ గుర్తుకొచ్చేదని, ఇప్పుడు నర్సింగ్కు తెలంగాణ కేరాఫ్గా మారిందని యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ (యూఎన్ఏ) అధ్యక్షుడు జాస్మిన్ షా కొనియాడారు. తెలంగాణలో నర్సులకు ఇస్తున్న ప్రాధాన్యం, నర్సింగ్ విద్యార్థులకు భారీగా స్టయిఫండ్ ఇవ్వడం వంటి చర్యలను ప్రశంసించారు. కేరళ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద నర్సుల సంఘంగా గుర్తింపు పొం దిన యూఎన్ఏ.. ప్రస్తుతం దేశంలోని 18 రాష్ర్టాలు, 36 దేశాల్లో విస్తరించి ఉన్నది. సుమారు 16 లక్షల మంది నర్సులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్లో పర్యటిస్తున్న జాస్మిన్ షా శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘కేరళలో పీజీ నర్సింగ్ విద్యార్థులకు మాత్ర మే స్టయిఫండ్ ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నవారికి కూడా స్టయిఫండ్ ఇవ్వడం గొప్ప విషయం. ఫస్టియర్ విద్యార్థులకు రూ.5 వేలు, సెకండ్ ఇయర్కు రూ.6 వేలు, థర్డ్ ఇయర్కు రూ.7 వేలు, ఫోర్త్ ఇయర్కు రూ.8 వేలు, ఎమ్మెస్సీ వారికి రూ.9 వేలు, 10 వేలు ఇస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. నర్సింగ్ విద్యార్థులకు భారీగా స్టయిఫండ్ ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్కు సెల్యూట్’ అని కొనియాడారు. 7 వేల నర్సుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు.
‘దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలు వైద్య అవసరాల కోసం నర్సులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి. కానీ తెలంగాణలో 7 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం గ్రేట్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పడుతున్న తపనకు ఇది నిదర్శనం’ అని జాస్మిన్ షా కొనియాడారు. తెలంగాణ నుంచి ఏటా 13-14 వేల మంది నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకొని బయటికి వస్తున్నారని, భవిష్యత్తులో దేశ నర్సింగ్ అవసరాలను తీర్చే అతి కొన్ని రాష్ర్టాల్లో తెలంగాణ నిలువబోతున్నదన్నారు. త్వరలో కేరళలో 2 లక్షల మంది నర్సులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, దీనికి సీఎం కేసీఆర్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తామని తెలిపారు.