హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అత్యుత్తమమైన ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలుచేయటంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ఉన్నదని కేంద్రమంత్రులే ప్రశంసిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ రాష్ర్టాల్లో కూడా ఇలాంటి పథకాలు లేవని ఆ పార్టీ నేతలే ఒప్పుకొన్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో బుధవారం గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో కేటీఆర్తోపాటు మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పథకాలు నంబర్ వన్గా ఉన్నాయని కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాల స్వయంగా మంత్రి తలసానిని ప్రశంసించారని గుర్తు చేశారు. మరో మంత్రి గిరిరాజ్ సింఘ్ జీవాల అంబులెన్స్లను పరిశీలించి ప్రశంసించారని తెలిపారు.
కులవృత్తులకు జీవం పోస్తున్నాం
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులవృత్తులకు జీవం పోసి ప్రజల ఆర్థిక పరిపుష్టి పెంచడంతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే గొల్ల, కురుమలకు బ్రహ్మాండమైన పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రూ.11 వేల కోట్లతో రెండు విడతలుగా గొర్రెలను పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. గొల్ల కురుమలకు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు. ‘సీఎం కేసీఆర్ ఆలోచన, నినాదం ఒక్కటే.. టాటాలు మాత్రమే కాదు.. మన తాతల నాటి కులవృత్తులు కూడా బాగుండాలె. అప్పుడే రాష్ట్రం కూడా బాగుంటది’ అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో గొర్రెల పెంపకం దారుల సంఘాల్లో 2.20 లక్షల మంది సభ్యులుంటే, నేడు 7.61 లక్షలకు పెరిగిందని తెలిపారు. గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్కే పరిమితమై సదర్ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
మనసున్న మారాజు కేసీఆర్: తలసాని
గత ప్రభుత్వాలు యాదవుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ‘ఉద్యమ నాయకుడే సీఎం కావడం వల్ల కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సంకల్పించి గొల్ల కురుమలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నరు. కేసీఆర్ మనసున్న మా రాజు. నిండు అసెంబ్లీలోనూ యాదవుల గొప్పతనం గురించి కేసీఆర్ గొప్పగా మాట్లాడారు. గొర్రెల సబ్సిడీ సొమ్మును నేరుగా లబ్దిదారులకే అందేలా నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేస్తున్నాం. మునుగోడు నియోజకవర్గం గొల్ల కురుమల గొర్రెల పంపిణీలో ఎటువంటి ఆందోళన చెందొద్దు. నవంబర్ 6న ఎన్నిక ముగిసిన వెంటనే అందరికీ గొర్రెలను అందజేస్తాం’ అని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, నోముల భగత్, జైపాల్ యాదవ్, అంజయ్యయాదవ్, బొల్లం మల్ల య్యయాదవ్, రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సంఘం చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, నల్లగొండ డీసీఎంఎస్ చైర్మన్ జానయ్య యాదవ్, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, కురమ సంఘం రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య పాల్గొన్నారు.
బండెనక బండికట్టి
రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహ భరిత వాతావరణంలో సాగింది. బండెనక బండి కట్టి అన్నట్టుగా..రాష్ట్రం నలుమూలల నుంచి వాహనాల్లో పెద్ద సంఖ్యలో గొల్ల కురుమలు సమ్మేళనానికి తరలివచ్చారు. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న టీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని, మునుగోడు ఎన్నికనే కాదు..రాబోవు రోజుల్లో జరిగే ఏ ఎన్నికకైనా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాడిన పాటలకు స్టెప్పులేసి ఆడిపాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు గొంగడి కప్పి గొర్రె, మేకలను గొల్ల కురుమలు అందజేశారు.
కేసీఆర్ వైపు నిలిచి ధర్మాన్ని గెలిపించాలి: మంత్రి హరీశ్రావు
ప్రేమ, ఆప్యాయతలకు గొల్లకురుమలు ప్రతీకలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. పాండవులు, కౌరవులకు మధ్య జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉండి ధర్మాన్ని గెలిపించాడని, గొల్మ కురుమలు కూడా తెలంగాణలో ధర్మం వైపు నిలబడి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మునుగోడులో గొల్లకురుమలకు గొర్రెలను పంపిణీ చేయకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నారని ఆరోపించారు. నవంబర్ 6 తర్వాత యథావిధిగా గొర్రెలను అందజేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్కు చెందిన మంత్రి రేవణ్ణ గొర్రెల పథకాన్ని చూసి ప్రగతిభవన్కు వచ్చిమరీ సీఎం కేసీఆర్ను సన్మానించారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు గొల్ల కురుమలను పట్టించుకోలేదని, ఎన్సీడీ స్కీంకు గ్యారంటీ ఇవ్వకపోవడంతో అప్పట్లో గొర్రెల పంపిణీని చేపట్టలేకపోయారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రుణంగా కాకుండా 75 శాతం సబ్సిడీగా గొర్రెలను అందించి మానవతను చాటుకొన్నారని కొనియాడారు. హైదరాబాద్లో గండి చెరువు వద్ద నిర్మిస్తున్న గొల్ల, కురుమ ఆత్మగౌరవ భవనాలను రెండుమూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు.