హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): దేశంలో 2031 వరకు జనాభా లెక్కలకు పూర్తి స్వరూపం వస్తుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. జనాభా లెక్కలతో పాటు, కుల గణన కూడా చేస్తున్నామని ఈ లెక్కలన్నీ 2031 వరకు సమగ్రంగా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 2027 జన గణన ఆధారంగానే డీలిమిటేషన్ చేయాలన్న రాజ్యాంగ నిబంధన ఉన్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు, దక్షిణభారత దేశంలో లోక్సభ సీట్లు పెంచాలనే ఉద్దేశంతోనే మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో పెట్టామని ఈ సందర్భగా చెప్పారు. ఈ బిల్లు వీగిపోతే ఇండియా కూటమి నేతలు సంబురాలు చేసుకుంటున్నారని, అంటే దేశాన్ని ఉత్తర, దక్షిణభారత దేశంగా విచ్ఛిన్నం చేయడమేని వారి ఎజెండా అంటూ ధ్వజమొత్తారు. ఏప్రిల్ 17 భారత మహిళలకు బ్లాక్డేగా అభివర్ణించారు.
గ్యారెంటీ హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని శోభాకరంద్లాజే విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజలను పిక్ పాకెటింగ్ చేస్తున్నారని, ఇలా చేస్తున్న రేవంత్రెడ్డిపై ఏ కేసు పెట్టాలని ప్రశ్నించారు. యువతులకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు నెలకు రూ. 2,500 హామీలిచ్చి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
పార్లమెంట్లో తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు కేంద్రమంత్రి శోభాకరంద్లాజే క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. అవమానించే ఉద్దేశంతో తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేయలేదని, మాట దొర్లిందని, ఆయన మాటలకు తానూ బాధపడ్డానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు.