హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకంపై కేంద్రం మరోమారు ప్రశంసలు కురిపించింది. ఈ పథకం అందరికీ స్ఫూర్తిదాయకమంటూ కేంద్రమంత్రులు దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ దండోరా వేస్తున్నారు. తెలంగాణను సందర్శించి మిషన్ భగీరథను చూసి రావాలని, దాని సాంకేతికతను
ఉపయోగించుకోవాలని కేంద్రం గతంలోనే స్వయంగా రాష్ట్రాలకు లేఖలు రాసింది. గ్రామీణప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేసిందని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తాజాగా మరోసారి కొనియాడారు. శనివారం ఆయన ఛత్తీస్గఢ్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పథకం దేశానికే స్ఫూర్తిదాయకమని చెప్పారు. గోవాతోపాటు మరో రెండు రాష్ర్టాలు కూడా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నాయని.. అయితే, తెలంగాణలో మాత్రం శుద్ధిచేసిన, బోర్లు, బావుల నుంచి కాకుండా భూ ఉపరితల జలం నల్లాల ద్వారా సరఫరా అవుతున్నదన్నారు. దాదాపు అన్ని రాష్ర్టాల అధికారులు, మంత్రులు స్వయంగా తెలంగాణలో పర్యటించి భగీరథ పథకాన్ని పరిశీలించి వెళ్లారు. కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే తమ రాష్ర్టాల్లో భగీరథను పోలిన పథకాన్ని రూపొందించే పనిలో ఉన్నాయి. కేంద్రం కూడా జల్జీవన్ మిషన్ పేరుతో మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా అమలుచేయడానికి పూనుకున్నది. తెలంగాణలో 24 వేలకుపైగా గ్రామాల్లో 65 లక్షల ఇండ్లకు శుద్ధిచేసిన తాగునీరు అందుతున్నది. గ్రామాల్లో సగటున 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లలో 150 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకానికి కేంద్రం నుంచి మూడుసార్లు హడ్కో అవార్డు లభించింది.