KCR | కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పాలని నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్లో రోడ్షో నిర్వహించారు. కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ వచ్చి నిర్మల్లో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆల్రెడీ రూ.2500 మహిళలకు ఇస్తున్నమని చెప్పిండు. ప్రతి ఇంట్లో మహిళలకు రూ.2,500 ఇస్తామన్నరు. మహిళలందరికీ రూ.2500 వచ్చినయా? ఒక్కరికీ రాలేదా? నర్సాపూర్ కూడా వచ్చిందటకదా? తెస్తానని మదన్రెడ్డి కాంగ్రెస్లో చొచ్చిండట కదా? తేలేదా? నిజమేనా మరి ? మదన్రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకుపోయిండు ? అంటూ ప్రశ్నించారు.
‘మీ అందరికీ నా చరిత్ర.. మదన్రెడ్డి చరిత్ర తెలుసు. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసింది కేసీఆరే కదా? మరి 70 ఏళ్ల వయసులో.. ముసలి తనానికి కుసుమ గుడాలు అన్నట్లు.. ఎవరి ఉద్దరిద్దామని పోయినట్లు మదన్రెడ్డి. ఏం చేద్దామని పోయినట్టు. ఇది ధర్మమేనా? మనందరినీ వదిలిపెట్టి వెళ్లిన మధన్రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని కోరుతున్నా. అసెంబ్లీ ఎన్నికల కంటే పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరుతున్నా’నన్నారు.
‘ఈ కాలువ పని మనకు ముఖ్యం. మల్లన్నసాగర్ నుంచి వచ్చే కాలువ మన బతుకుదెరువు. నర్సాపూర్పై ఉండే ప్రేమతో.. సునీత గెలిచినకాడి నుంచి దాని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ మెడలు వంచి నీళ్లు తేవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. ఆయనతో పాటు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి. మన పొలాలు గోదావరి నదీ జలాలతో నర్సాపూర్ పొలాలు పారాలి. అదే కేసీఆర్ కల అని మనవి చేస్తున్నా’నన్నారు కేసీఆర్.