హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణ పనులేవీ ఏపీ చేపట్టడం లేదంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పచ్చి అబద్ధాలు ప్రకటించింది. ప్రాజెక్టు పనులపై ముందుకుపోవద్దంటూ గతంలో ఏపీకి జారీ చేసిన ఆదేశాలను, ఎన్జీటీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు పరిశీలించి కేఆర్ఎంబీ సమర్పించిన నివేదికను తుంగలో తొక్కింది. గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణ పనులు, దీనికి ఎన్ని నిధులు కేటాయించారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర జల్శక్తి శాఖను ప్రశ్నించారు. దీనికి కేంద్ర జల్శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ ఇచ్చిన సమాధానాలపై తెలంగాణ ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఇచ్చిన సమాచారం మేరకు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులేవీ చేపట్టలేదని పార్లమెంట్ సాక్షిగా వెల్లడించడంపై తెలంగాణ వాదులు ముక్కున వేలేసుకొంటున్నారు. నేడో, రేపో ఆ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఎన్జీటీ తీర్పు వెలువరించే అవకాశముండగా, అందుకు విరుద్ధంగా కేంద్ర మంత్రి ప్రకటన చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రారంభమైంది. దీని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు జీవోలు జారీ చేసి నెలల వ్యవధిలో పనులను పూర్తి చేశారు. దీన్ని అప్పట్లో తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల నుంచి 88 వేల క్యూసెక్కులకు పెంచుతూ 203 జీవోను విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ దిగువన ఉన్న కుడి ప్రధాన కాలువలోకి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం దీని లక్ష్యం. ఆయా పనులకు టెండర్లను కూడా ఆహ్వానించారు.
ఏపీ చేపట్టిన పనులు పూర్తయితే పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగడంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడనున్నది. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సర్కారు జీవోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు న్యాయపోరాటానికి అధికారులను ఆదేశించారు. అనేకసార్లు కేఆర్ఎంబీకి, కేంద్ర జల్శక్తిశాఖకు, సీడబ్ల్యూసీకి లేఖలు రాయడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకుపోవద్దని ఏపీని ఆదేశిస్తూ గతంలో కేఆర్ఎంబీ స్వయంగా లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఏపీ సర్కారు పనులు చేపట్టడంతో తెలంగాణ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని పేర్కొనడంతో ప్రాజెక్టును సందర్శించి పనులు జరుగుతున్నాయో? లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఎన్జీటీ సూచించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారుల బృందం ఏపీ ప్రభుత్వం అప్పటికే పూర్తి చేసిన పనులు, దానికి సంబంధించి వివరాలతో కూడిన 12 పేజీల నివేదికను ఎన్జీటీకి సమర్పించగా, ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టే విధించింది. ఇందుకు విరుద్ధంగా పోతిరెడ్డిపాడు విస్తరణ పనులేవీ ప్రారంభం కాలేదని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.