కాచిగూడ, డిసెంబర్ 23: కులగణన చేపడితే సమాజ విభజన జరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడ అభినందన్ హోటల్లో శనివారం జరిగిన బీసీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని, వెంటనే కులగణన చేపట్టాలని కోరారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలవారీగా జనాభా లెక్కలు తేల్చి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి, విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 నుంచి 52 శాతానికి పెంచాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చిన బీసీల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.