నిజామాబాద్ : కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరా తీయగా, జిల్లాలో కేంద్ర పథకాల అమలు సమర్థవంతంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
ముద్ర రుణాల పంపిణీలో నిజామాబాద్ నగరపాలక సంస్థ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. 23 వేల పైచిలుకు మందికి ముద్ర రుణాలు అందించారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంత పంటల సాగు పరిస్థితి గురించి కేంద్ర మంత్రి అడుగగా, నిజామాబాద్ రైతాంగం పంటల సాగులో ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులు అవలంభిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
అనేక మంది విత్తనోత్పత్తి ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించారని అన్నారు. జిల్లాలో వరి సాగు ప్రధానమైనప్పటికి, ఇతర మిశ్రమ పంటలను కూడా సాగు చేస్తారని వివరించారు. పసుపు పంట సాగు లో నిజామాబాద్ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంత్రికి తెలిపారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రవి తదితరులు ఉన్నారు.