హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తుండగా, అదే కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మరో లెక్క చెప్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను తాము చెప్పిందే నిజమని నమ్మించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటులో చెప్పిన లెక్కకు.. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి చెప్పిన లెక్కకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తున్నా అదే అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనలోని రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ రుణాలు అత్యంత పరిమితిలోనే ఉన్నప్పటికీ కొంపలు మునిగిపోయాయి అన్నంతగా గగ్గోలు పెడుతున్నారు.
అక్కసుతోనే ఆరోపణలు
సింగిల్ ఇంజిన్ సర్కార్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా దూసుకుపోతుంటే.. డబుల్ ఇంజిన్ అని చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో ఆర్థికంగా బలపడుతుంటే, బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ ఫెయిల్యూర్ సర్కార్లుగా నిలుస్తున్నాయి. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నది. జీఎస్టీలోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. రుణాల కట్టడిలోనూ తెలంగాణ మార్గమే అనుసరణీయమని రుజువైంది. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంటు సాక్షిగా అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని కిషన్రెడ్డి ఇటీవల ఆరోపించారు. ఆయన మాట అందుకొన్న బీజేపీ నేతలంతా ఇదే రాగం పాడుతున్నారు. కానీ, 2023 మార్చి చివరి నాటికి రాష్ట్ర అప్పులు దాదాపు రూ.3.66 లక్షల కోట్లు మాత్రమే.
దేశంలో అతి తక్కువ అప్పులు చేసిన ఐదు ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికల ఆధారంగా కేంద్రం అందించిన తాజా డాటా ప్రకారం..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పొందిన మొత్తం అప్పులు దాదాపు రూ.5.17 లక్షల కోట్లు. 2019 మార్చి నాటికి రాష్ట్ర అప్పులు రూ.1.9 లక్షల కోట్లు ఉండగా, కొవిడ్-19తో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం తర్వాత 2021 నాటికి రూ.2.71 లక్షల కోట్లకు పెరిగింది. 2023 మార్చి చివరి నాటికి అప్పులు రూ.3.66 లక్షల కోట్లకు చేరాయి. అయితే, వాణిజ్య బ్యాంకుల నుంచి తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్లు, పీఎస్యూలకు సుమారు రూ.1.31 లక్షల కోట్ల రుణాలు అందుబాటులో ఉన్నాయని గత ఫిబ్రవరిలో కేంద్రమే పార్లమెంటులో ప్రకటించింది. 2023 ఫిబ్రవరి వరకు నాబార్డ్ నుంచి తీసుకొన్న అప్పు దాదాపు రూ.19,431 కోట్లు అని తెలిపింది. మొత్తంగా ఈ ఏడాది మార్చి నాటికి తెలంగాణ అప్పు రూ.4.33 లక్షల కోట్లు అని లెక్కగట్టింది. అదే ప్రభుత్వంలో ఉన్న కిషన్రెడ్డి మాత్రం రాష్ట్ర అప్పులను ఏకంగా రూ.8 లక్షల కోట్లకు పెంచి చూపుతుండటం గమనార్హం.
ఆ రాష్ర్టాలకంటే చాలా తక్కువ
ఇతర ప్రధాన రాష్ట్రాలు, ప్రత్యేకించి బీజేపీ పాలించిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అప్పులు చాలా తక్కువగా ఉన్నాయని ఆర్బీఐ, కేంద్ర గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణే. ఈ ఏడాది మార్చి నాటికి తమిళనాడు అత్యధికంగా రూ.7.53 లక్షల కోట్ల అప్పు చేసింది. రూ.7.1 లక్షల కోట్లతో డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో ఉన్నది. మహారాష్ట్ర (రూ.6.8 లక్షల కోట్లు), పశ్చిమబెంగాల్ (రూ.6.08 లక్షల కోట్లు), రాజస్థాన్ (రూ.5.37 లక్షల కోట్లు), కర్ణాటక (రూ.5.35 లక్షల కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ.4.42 లక్షల కోట్లు), గుజరాత్ (రూ.4.23 లక్షల కోట్లు), కేరళ (రూ.3.9 లక్షల కోట్లు) మధ్యప్రదేశ్ రూ.3.78 లక్షల కోట్ల అప్పులు చేశాయి. నిజానికి రాష్ర్టాలకు ఇష్టమొచ్చినట్టుగా అప్పులు చేసే అధికారం కూడా లేదు. అప్పులు పెంచుకోవాలంటే కేంద్రాన్ని సంప్రదించాల్సిందే. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది. 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం పెంచాలని గతంలో రాష్ట్రప్రభుత్వం కోరితే కేంద్రం తిరస్కరించిన విషయం కూడా కేంద్రంలో భాగమైన కిషన్రెడ్డికి కూడా తెలుసు. అయినా, అడ్డదిడ్డమైన లెక్కలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలకు తెరలేపారని నిపుణులు విమర్శిస్తున్నారు.