హైదరాబాద్ : ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కట్టడం రామప్ప దేవాలయాన్ని(Ramappa) శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు. ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.
అనంతరం పాలంపేటలో ప్రసాద్ పథకంలో మంజూరు చేసిన తీర్థయాత్ర, వారసత్వ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలన్నారు. ములుగు ప్రాంతంలో అనేక పర్యటక ప్రాంతాలు ఉన్నాయని వాటి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. టూరిజం ఎక్కువగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.