హైదరాబాద్ : తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ( Kaleshwaram ) ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన కేంద్ర జల్శక్తి మంత్రి వెంటనే క్షమాపణ ( Apologize ) చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి ( KR Suresh Reddy ) డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని కోరారు. ఏపీ అమరావతి రాజధానికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై గురువారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో సాగు, తాగు నీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని హెచ్చరించారు.
కాళేశ్వరంలో లక్షా కోట్లు అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మూడు బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 15 వేల పైపులైన్లు, 25 టన్నెళ్లు ఉన్నాయని వివరించారు. అనేక విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు . అయితే కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల రెండు పిల్లర్లు కుంగిపోయాయని, మూడు వందల కోట్లతో మరమ్మతులు చేస్తే ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని వెల్లడించారు.