హైదరాబాద్ : దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తూ.. అద్భుత ఫలితాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇందుకు గానూ కేంద్రం మిషన్ భగీరథకు అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ మేరకు ఢిల్లీకి రావాలని కేంద్ర జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆ శాఖల అధికారులు, సిబ్బందిని, స్థానిక ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ అభినందించారు. ఇప్పటికే తెలంగాణకు మంచినీటి సరఫరాలో పలు అవార్డులు రివార్డులు వచ్చాయి. దేశంలో వంద శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. వంద శాతం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చింది.
తాజాగా దేశంలో అత్యుత్తమ, అద్భుత ప్రతిభ కనబరచిన రాష్ట్రంగా తెలంగాణకు అవార్డు వరించింది. స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి వివిధ కేటగిరీలలో మరో 13 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను కూడా అక్టోబర్ 2వ తేదీననే రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం అందుకోనుంది. ఒకే రోజు 14 అవార్డులను ప్రభుత్వం అందుకోనుంది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారం వల్లే ఈ అవార్డులు వస్తున్నాయన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు అహర్నిశలు పని చేస్తున్న తన సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరినీ మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ఈ అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు, మంత్రి కేటీఆర్ సహకారంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని దయాకర్ రావు స్పష్టం చేశారు.