BRS Parliamentary Party | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం రహస్యం పాటిస్తుందని, ఎంపీలకు సరైన సమాచారం ఇవ్వడంలేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన అఖిల పక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎంపీల వాదన వినడంలేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు అన్నారు.
ఇది స్పెషల్ సేషనా.. నార్మల్ సేషనా, స్పెషల్ సెషన్స్లో ఎజెండా ఏమిటి..? అంటూ కేశవరావు ప్రశ్నించారు. ఈ సెషన్ తర్వాత వింటర్ సెషన్ ఉంటుందా, కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్లే సెషనా అనేది ప్రభుత్వం చెప్పాలని కే కేశవరావు అన్నారు. కానీ, ఇవేవి చెప్పడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో సభ్యులను సస్పెండ్ చేస్తూ పోతున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు.
సనాతన ధర్మం కోరే వాళ్ళు ఒకటి కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని కే కేశవరావు గుర్తు చేశారు. అంటే సనాతన, నాన్ సనాతన గొడవ పెట్టుకోవాలా, సనాతన, నాన్ సనాతన వేర్వేరుగా ఉండాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎజెండా లేకుండా ప్రత్యేక సమావేశాలు ఏమిటో అర్థం కావడం లేదని లోక్సభ బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఎజెండా మొత్తం చెప్పాలని, కానీ, రెండు మూడు రోజుల అంశాలనే వెల్లడించారన్నారు. తొలి రోజు 75 ఏండ్ల అంశాలుంటాయని, ఆ తరువాత రోజు ఫొటో సెషన్ చెప్పారని, ప్రత్యేక సమావేశాల్లో ఏం చర్చిస్తారో చెప్పలేదన్నారు. రహస్య ఎజెండా ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
మహిళ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల బిల్లులు పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని నామా నాగేశ్వరరావు చెప్పారు. ఇవే కాకుండా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీఏసీ అయితే తప్ప సమావేశాల ఎజెండా తెలిసేలా లేదన్నారు. సమావేశాలు ఎప్పటివరకు జరుపుతారో కూడా చెప్పడం లేదన్నారు. స్పెషల్ సెషన్స్ పేరుతో ప్రభుత్వం ఏదో దాచి పెడుతోందని, ఇలాంటి పద్దతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.