హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ‘నీట్’ పేపర్ లీక్ ఘటన దేశ విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషయాన్ని బహిర్గతం చేసిందని రాజ్యసభ సభ్యుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి పీ సంతోష్కుమార్ అన్నారు. అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్), అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జాతీయ సమితిల సంయుక్త ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయంలో ఆదివారం “నీట్ పేపర్ లీకులు – ప్రభుత్వ విద్యపై దాడి” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సంతోష్కుమార్ మాట్లాడుతూ.. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
పోటీ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న లీకులు, అవినీతి, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో ‘జేఎన్యూ అసోసియేట్ ప్రొఫెసర్ అజయ్ గుడావర్తి ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషణ్కుమార్ సిన్హా, ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ రంగరాజ్, ప్రొఫెసర్ అరుణ్కుమార్ పాల్గొన్నారు.