న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశ ఆర్థిక వ్యవస్థపై బీజేపీ నేతలు చెప్పుకుంటున్నవి డాంబికాలే తప్ప వాస్తవాలు కాదని తాజాగా విడుదలైన రిజర్వ్బ్యాంక్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడేండ్లలో జీడీపీని పరుగులు పెట్టించామని, పారిశ్రామికాభివృద్ధి పెంచామని, గ్రామీణ ఆదాయాల్ని రెట్టింపు చేశామని, నిరుద్యోగాన్ని తగ్గించామంటూ బీజేపీ నేతలు చేస్తున్నది ప్రచార ఆర్భాటమేనని ‘కరెన్సీ అండ్ ఫైనాన్స్ 2021-22’ పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక రుజువు చేస్తున్నది. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని స్వయానా రిజర్వ్బ్యాంకే గణాంకాలతో వివరించింది. కొవిడ్ సంక్షోభానికి ముందే ఆర్థికవ్యవస్థ కునారిల్లిందని, గ్రామీణ వేతనాలు పడిపోయాయని, నిరుద్యోగం పెరిగిందని ఆర్బీఐ గణాంకాల్లో స్పష్టమయ్యింది. డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు)తో మూలధన కల్పన పడిపోయిందని కూడా డాటాలో వెల్లడయ్యింది.
యూపీఏ హయాంలో 2011-14 మధ్యకాలంలో 5.7 శాతానికి తగ్గిన ఆర్థికాభివృద్ధిని విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిన బీజేపీ..2017-20 మధ్య అంతే శాతం మందకొడి వృద్ధిని కనపర్చగలిగిందని ఆర్బీఐ డేటా వెల్లడిస్తున్నది. మోదీ ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ మందగమనంలో స్పష్టంగా కన్పిస్తున్నది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించిన 2008-2009 తర్వాత అత్యంత కనిష్ఠం 3.7 శాతం వృద్ధి 2019-20లోనేనని ఆర్బీఐ నివేదిక తెలిపింది. కొవిడ్ సంక్షోభం తలెత్తడానికి ముందు వరుసగా 8 త్రైమాసికాల్లో జీడీపీ వృద్ది మందకొడిగా ఉందన్నది.
దేశంలో పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనంగా నిలిచే మూలధన కల్పన సైతం బాగా పడిపోయింది. రిజర్వ్బ్యాంక్ గణాంకాల ప్రకారం జీడీపీలో స్థూల మూలధన కల్పన రేషియో 2015-16లో 32.1 శాతం కాగా, అది 2019-20కల్లా 30.7 శాతానికి తగ్గింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు ఉన్న 32 శాతంపైగా రేషియో కొవిడ్కు ముందే పడిపోవడం గమనార్హం. వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గడంతో విస్తరణ ప్రాజెక్టులకు కార్పొరేట్లు ఆసక్తి కనపర్చకపోవడంతో మూలధన కల్పన లోపించింది. కొన్ని ప్రధాన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు లిక్విడిటీ సమస్యల్లో చిక్కుకోవడం, బ్యాంకింగ్ రంగంలో భారీగా నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడం, అదే సమయంలో కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు దెబ్బతినడమే మూలధన కల్పన తగ్గడానికి కారణమని ఆర్బీఐ నివేదిక వివరించింది. ఇదే సమయంలో వినియోగం, పెట్టుబడులు పడిపోయాయని, వ్యాపార, వినియోగ విశ్వాసం సన్నగిల్లిందని పేర్కొంది.
రిజర్వ్బ్యాంక్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొవిడ్కు ముందే ఉపాధి కల్పన పడిపోయింది. వ్యవసాయ, వ్యవసాయేతర విభాగాల్లో గ్రామీణ వేతనాల వృద్ధి తగ్గిందని పేర్కొంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉపాధి కల్పన క్షీణించడంతో తక్కువ గ్రామీణ వేతనాలకు ఒక కారణమని ఆర్బీఐ తెలిపింది. ఈ వేతనాల తగ్గుదల డీమానిటైజేషన్ తర్వాత ప్రస్ఫుటంగా కన్పించడం గమనార్హం. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో గ్రామీణ వేతనాల వృద్ధి పెద్ద నోట్ల రద్దు తర్వాత 2017-2020 మధ్యకాలంలో 6 శాతం లోపునకు తగ్గిందని నివేదిక తెలిపింది. కొవిడ్ సంక్షోభాగానికి ముందే నాలుగేండ్ల పాటు వేతనాల వృద్ధి 6 శాతంలోపే ఉన్నదని స్వయాన ఆర్బీఐ గణాంకాలే వెల్లడిస్తుంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామంటూ బీజేపీ నేతలు చెప్పుకోవడం ప్రచార్భాటం తప్ప మరోటి కాదు.