హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) /ఎల్బీనగర్, జూలై 4 : ఎన్నికల ముందు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి, ఆ తర్వాత నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఇచ్చిన హామీలో పది శాతం కూడా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల పోలీస్శాఖలో కేవలం 5వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వగా, ఆ ఉద్యోగాలు సరిపోవని, వెంటనే 20వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులపై సీఎం వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల శిల్పకళావేదిక సభలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. పొర్లు దండాలు పెట్టినా, ఎండ్రిన్ తాగి మరణించినా, బావిలో దూకి సచ్చినా తాను పోలీస్ వి భాగంలో 5వేల కంటే ఎక్కువ ఒక్క ఉద్యోగం ఇవ్వనంటూ పేర్కొనడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు.
దీంతో ‘సీఎంగా రేవంత్రెడ్డిని ఎన్నుకోవడం మా దౌర్భాగ్యం’ అంటూ నిరుద్యోగులు శనివారం దిల్సుఖ్నగర్లో మెరుపు ఆందోళనకు దిగారు. నిరుద్యోగులపై సీఎం హోదాలో నిర్దయగా మాట్లాడటంతో కొన్నాళ్లు గా తిండి తిప్పలు మానుకొని, తల్లిదండ్రులు పంపే డబ్బులతో కోచింగ్ తీసుకుంటున్న తమ మనోభావాలు దెబ్బతిశారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించారు.
సీఎం రేవంత్రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు నిరుద్యోగులు చైతన్యపురి నుంచి సరూర్నగర్ పోలీస్స్టేషన్కు ర్యాలీగా తరలివెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు ఈడ్చిపడేశారు. జేఏసీ నాయకులను పోలీసులు ఎత్తిపడేసి అరెస్టు చేశారు. ఈ క్రమంలో జేఏసీ నాయకు డు ఇంద్రానాయక్ దుస్తులు చిరిగిపోయాయి.
ఈ ఘటనతో దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రాజకీయ నాయకులతో తమను కలిపి అసహ్యం గా మాట్లాడిన సీఎం.. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మమ్మల్ని చంపే హక్కు, చామమనే హక్కు మీకు ఎవ్వరిచ్చారు’ అని సీఎంను ప్రశ్నిస్తూ వేలాది సంఖ్యలో రోడ్డెక్కారు. సీఐ పోలీస్ బలగాలతో అడ్డుకుని వారి నుంచి ఫిర్యాదు పత్రాన్ని లాక్కొని జేఏసీ నేతలను అరెస్టు చేసి నాగోల్ పోలీస్స్టేషన్కు తరలించారు. జేఏసీ నాయకు లు ఇంద్రానాయక్, ఆకాశ్గౌడ్, నవీన్ పట్నాయక్, భూక్యకుమార్, శింబునాయక్, వంశీ, శంకర్నాయక్, నవీన్గౌడ్, రవికుమార్, వినయ్ని అదుపులోకి తీసుకొని సాయంత్రం వదిలిపెట్టారు.
‘ఐదు వేల పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చా. గతంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి. ఇప్పుడు ఇస్తేనే ధర్నాలు చేస్తున్నారు ఇదెక్కడిదో. గతంలో మెట్రో కట్టాలని మ నం అనేది. ఇప్పుడు మెట్రో కట్టొద్దని వాళ్లు అంటున్నారు. గతంలో మూసీని ప్రక్షాళన చేయాలని మనం అడిగేది. ఇప్పుడు మూసీని చేయడానికే వీలు లేదని అంటున్నారు. గతంలో రీజినల్ రింగ్రోడ్డు కావాలని మనం అడిగేది. ఇప్పు డు వద్దంటున్నరు. ఏదిజూసినా వద్దో.. వద్దో.. వద్దో అని ఒర్లుబోతుల్లాగా తయారైండ్రు. మీరు ఒర్లినా.. పొర్లు దండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బాయిలో దుంకినా.. ఇయన్నీ పనులుజేస్తా. మీరందరూ నిండుమనుసుతో ఆశీర్వదించండి’
(ఇటీవల శిల్పకళావేదికలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు)