Group-1 Mains | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులను ఎప్పటినుంచో ఊరిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు త్వరలో రానున్నాయి. వారంలోగా ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో మెయిన్స్కు ఎంపికైనా ఈమారు అవుతామో లేదోనని, అవకాశం కోల్పోతామేమోనని అభ్యర్థుల్లో భయం నెలకొన్నది. దీంతో గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని ఉద్యమమే చేస్తున్నారు.
టీజీపీఎస్సీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమూ తమ వినతిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ దశలో నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా 1:50 నిష్పత్తి ప్రకారమే మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ తేల్చిచెప్పింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు. ఇదే జరిగితే ఇక ఉద్యమాలను ఉదృతం చేయడం తప్ప మరో దారి కనిపించడం లేదన్న అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చినట్టు తెలుస్తున్నది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే ఇది అవాస్తవమే అని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పతి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు. అందరికీ న్యాయం జరగాలంటే గతంలో మాదరిగా జీవో 55ను అమలు చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2లో 2 వేలు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టుల సంఖ్యను పెంచుతూ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఈ విషయంలో నూ న్యాయపరమైన చిక్కులు వస్తాయంటూ మం త్రులు చెప్పడం హస్యాస్పదమని న్యాయనిపుణు లు అభిప్రాయపడుతున్నారు. అదనపు పోస్టులు పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు కమిషన్ చరిత్రలో అనేకం ఉన్నాయని, ఈ విషయాన్ని మరిచిపోవద్దని నిపుణులు గుర్తు చేస్తున్నారు. డీఎస్సీ పరీక్ష వాయిదాకూ అభ్యర్థులు పట్టుబడుతున్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 4 వరకు డీఎస్సీ పరీక్షలు ఉండగా, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉంటే ఎలా ప్రిపరేషన్ కావాలంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.