సిద్దిపేటలో దేశంలోనే తొలి భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రం
రెండో దశ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
త్వరలోనే 13 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన
సిద్దిపేట, ఏప్రిల్ 20: సిద్దిపేట పట్టణంలో చేపట్టిన దేశంలోనే తొలి భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. జనావాసాల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి పంట పొలాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించడంతోపాటు దోమలు, ఈగలు లేని స్వచ్ఛ ఆరోగ్య పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా అమృత్ పథకం కింద నర్సాపూర్ చెరువు వద్ద దీనిని నిర్మించారు.
మొదటి దశలో పట్టణంలోని చింతల్ చెరువు వద్ద మూవింగ్ బెడ్ బయో రియాక్టర్(ఎంబీబీఆర్) సాంకేతికత ఆధారంగా నిర్మించారు. నర్సాపూర్ చెరువు వద్ద సీక్వెన్సియల్ బ్యాచింగ్ రియాక్టర్ (ఎస్బీఆర్) సాంకేతికత ఆధారంగా 3.25 ఎకరాల్లో రూ.12.54 కోట్లతో 11 ఎల్ఎండీ కెపాసిటీతో నిర్మించగా, దీనిని బుధవారం మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. మురుగును శుద్ధి చేసేందుకు 180 కిలోమీటర్ల మేర 150 డయా నుంచి 700 డయా కెపాసిటీ గల అం డర్గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ను నిర్మించారు.
పని విధానం ఇలా..
నర్సాపూర్ ఎస్టీపీ ట్యాంక్లో ఎస్బీఆర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఎన్క్యాచ్మెంట్ పరిధిలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీటిని మొదట రిప్పింగ్ చాంబర్లోకి వదిలి, 25 ఎంఎం పైన గల వ్యర్థాలను స్క్రీనింగ్ చేస్తారు. ఇందులో నుంచి మురుగును వెట్వెల్ పంపుహౌస్లోకి పంపి, ఇందులో మురుగు నీటిని 5 పంపుల సాయంతో ఆటోమెటిక్ పద్ధతిలో ప్రైమరీ ట్రీట్మెంట్ యూనిట్ (పీటీయూ)లోకి వదులుతారు. ఇందులో నుంచి స్టీలింగ్ చాంబర్లోకి పంపి, అక్కడి నుంచి మురుగు నీటిని ఫైన్ స్క్రీన్ చాంబర్లోకి పంపి, అక్కడ 6 ఎంఎం పైన ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు.
చానల్ ద్వారా మరో చాంబర్లోకి నీటిని పంపించి, నీటిలో కలువని వ్యర్థాలను తొలగిస్తారు. అనంతరం నీటిలోని ఇసుకను రేక్ మెకానిజం సాయంతో తొలగిస్తారు. ఇందులోని నీటిని ఎస్బీఆర్-1, 2లోకి పంపించి, 4 దశల్లో నీటిని శుద్ధి చేస్తారు. మొదటి దశలో ఫిల్లింగ్, ఎయిరేషన్, సెట్లింగ్, డిక్యాంటింగ్ అనే ప్రక్రియల ద్వారా సైక్లింగ్ చేయడంతో మురుగు నీటిలో ఉన్న స్లడ్జ్ మొత్తం కిందకి చేరుకుంటుంది. ఈ వ్యర్థాలను సెంట్రిప్యూయిడ్లోని సంపులోకి పంపి, నీరు లేకుండా పొడిగా మార్చి ఎరువుగా తయారుచేస్తారు. ఎస్బీఆర్లోని నీటిని క్లోరినేషన్ కాంటాక్టు ట్యాంక్ (సీసీటీ)లోకి పంపి, క్లోరినేషన్ చేసి నీటిని శుద్ధి చేస్తారు.