జగదేవ్పూర్, నవంబర్ 6: సీమాంధ్ర పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఉద్యమనేత, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల ప్రజలు శ్లాఘించారు. ఎన్నో దశాబ్దాల నుంచి కొనసాగుతున్న తమ భూసమస్యలను పరిష్కరించి పట్టాలు అందించిన సీఎం కేసీఆర్ను దేవుడిగా కొనియాడారు. అటువంటి గొప్ప నాయకుడిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం ఆ తీర్మాన పత్రాలను కొత్తపేట సర్పంచ్ వెంకట్రామ్రెడ్డి, ఉపసర్పంచ్ మహేశ్ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కండ్లని పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం మాయమాటలు చెప్పే విపక్ష నాయకులకు తగిన బుద్ది చెప్పాలని సూచించారు. సీఎం కేసీఆర్ను కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో సైనికుల్లా పనిచేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేస్తే మళ్లీ కష్టాల పాలవ్వాల్సిందేనన్న విషయాన్ని ప్రజలందరికీ వివరించాలని కోరారు.
దివ్యాంగుల సంపూర్ణ మద్దతు
బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపతూ వట్టిపల్లె వికలాంగ నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాదాకృష్ణశర్మతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే తమకు నెల నెలా రూ.4 వేల పెన్షన్ అందిస్తున్న సీఎం కేసీఆర్.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.6,016 పెంచుతామని ప్రకటించడం సంతోషదాయకమని పేర్కొన్నారు.