హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఒకే నైపుణ్యం, ఒకే ఉద్యోగంపై ఆధారపడటం అత్యంత ప్రమాదమని యూకేలో బాంగోర్, అబెరిస్విత్ యూనివర్సిటీల వైస్చాన్స్లర్లు ప్రొఫెసర్ నికోలా కాల్లో, ప్రొఫెసర్ టిమోతి వుడ్స్ అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశలోనే మూడు, నాలుగు నైపుణ్యాలను ఆర్జించడం ఉత్తమమని సూచించారు. నాలుగు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న వారు గురువారం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అమీర్పేట సెస్లో జరిగిన ‘కరిక్యులం డెవలప్మెంట్’ సెమినార్కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో వారు ప్రత్యేకంగా మాట్లాడారు. ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించడం, వారు పడుతున్న ఇబ్బందులపై అడిగిన పలు ప్రశ్నలకు పైవిధంగా బదులిచ్చారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులు బహుళ నైపుణ్యాలు అలవర్చుకొని ఏ ఉద్యోగంలోనైనా చేరేలా సంసిద్ధం కావడమే ఏకైక పరిష్కారమని సూచించారు. తరగతిలో ఒక విద్యార్థి మిగతా తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించేలా ఫ్లిప్డ్ క్లాస్రూంను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వారు చెప్పారు. ఇంకా ఏమన్నారో.. వారి మాటల్లోనే..
నాలుగు కోర్సులకు కొత్త కరిక్యులం
ఉత్తమ కరిక్యులంతోనే చక్కటి విద్యా విధానం సాధ్యం అవుతుంది. మా కరిక్యులాన్ని తెలంగాణలోని వర్సిటీలు.. రాష్ట్రంలోని వర్సిటీల కరిక్యులాన్ని మేం తీసుకొని సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం తర్వాత అన్నిరకాల నైపుణ్యాలు మేళవించిన కొత్త కరిక్యులం అందుబాటులోకి వస్తుంది. కామర్స్, చరిత్ర, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం సబ్జెక్టులకు కొత్త కరిక్యులం రూపొందించి, అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీంతో చాలా లాభాలు ఉంటాయి.
అమ్మాయిల చదువు అద్భుతం
ఉన్నతవిద్యలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధిస్తున్నది. అమ్మాయిల చదువు బాగా పెరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో జాతీయ సగటు మించి తెలంగాణ నమోదు చేసింది. రాష్ట్రంలో అనేక ఐటీ కంపెనీలు ఉండటం విద్యార్థులకు అత్యంత అనుకూలం. రాష్ట్రంలో విద్యావకాశాల పెంపు, కరిక్యులంలో మార్పులకు ప్రయత్నాలు చేస్తున్నాం.
యూకేలో పెరుగుతున్న భారతీయ విద్యార్థులు
యూకేలో చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. ఫీజులు, అనుకూల వాతావరణమే ఇందుకు కారణం. అయితే కన్సల్టెన్సీలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. వసతులు, ఫీజు విధానం, జీవన వ్యయంపై అవగాహన కల్పించడం లేదు. అవగాహన లేకుండా వచ్చిన వారే తిప్పలు పడుతున్నారు. యూకేకు వచ్చే ముందు అన్నింటిపై అవగాహన ఉండాలి.