సీజే జస్టిస్ సతీశ్చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
తెలంగాణ హైకోర్టుకు ఐదో సీజే భూయాన్
అన్ని కోర్టుల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదించారు. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అస్సాం రాష్ర్టానికి చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్ భూయాన్ సీనియర్ న్యాయవాది. అస్సాం అడ్వొకేట్ జనరల్గా కూడా పనిచేశారు.
సుదీర్ఘ అనుభవం
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న గువాహటీలో జన్మించారు. అక్కడి డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, కాటన్ కాలేజీలో ఇంటర్, దిల్లీలోని కిరోరి మాల్ కాలేజీలో డిగ్రీ చేశారు. గువాహటీ ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ, గువాహటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం చేశారు. 1991 మే 20న అస్సాంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 16 ఏండ్లపాటు ఆదాయపు పన్ను శాఖకు స్టాండింగ్ కౌన్సిల్గా, 2008 డిసెంబర్ 3న ఆదే శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా, 2002 నుంచి 2006 వరకు గువాహటీ హైకోర్టు-మేఘాలయ బెంచ్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా చేశారు. 2005 నుంచి 2009 వరకు అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ప్రత్యేక న్యాయవాదిగా, 2010 మార్చి 3న గువాహటీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరం రాష్ర్టాల్లో న్యాయవాదిగా పని చేశారు. కేంద్ర పరిపాలనా టిబ్యునల్ (క్యాట్), గువాహటీ బెంచ్, అస్సాం బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో కూడా ప్రాక్టీస్ చేశారు. అన్ని స్థాయి కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఆయన సొంతం.
ఒకే రాష్ట్రం నుంచి ఇద్దరు సీజేలు
తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురు సీజేలు పనిచేశారు. జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సతీశ్చంద్రశర్మ సీజేలుగా సేవలందించారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఐదో సీజే కానున్నారు. అస్సాం రాష్ర్టానికి చెందినవారు రెండు హైకోర్టులకు సీజేలుగా ఉన్నారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కంటే సీనియర్ అయిన జస్టిస్ గోస్వామి ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. తాజాగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలంగాణ హైకోర్టు సీజే అవుతున్నారు. తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ర్టాల హైకోర్టులకు కొత్త సీజేలను నియమించారు. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సింఘీ ఉత్తరాఖండ్ సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమ్జద్ ఏ సయీద్ను హిమాచల్ప్రదేశ్ సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎస్ షిండేను రాజస్థాన్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రష్మిన్ ఎం ఛాయాను గువాహటీ సీజేగా రాష్ట్రప్రతి నియమించారు.