Srisailam | శ్రీశైలం : ఉగాది మహోత్సవాలకు శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు విశాలమైన తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కైలాసద్వారానికి నిరంతరం మంచినీటి సరఫరా చేయాలన్నారు. ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలిక పైప్లైన్ ద్వారా మంచినీరు అందజేస్తున్నట్లు తెలిపారు.
కాగా ఈ ఏర్పాట్ల పరిశీలన భాగంగా శుక్రవారం కార్యనిర్వహణాధికారి వారు సంబంధిత ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగ అధికారులతో కలిసి కైలాసద్వారం, భీమునికొలను మెట్లమార్గం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా హటకేశ్వరం, సాక్షిగణపతి వద్ద కూడా ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా ఉండాలన్నారు. అధికారులందరూ కూడా పరస్పర సమన్వయంతో ఆయా ఏర్పాట్లలలో నిమగ్నం కావాలన్నారు.
అనంతంరం కార్యనిర్వహణాధికారి వారు కైలాసద్వారం వద్ద కన్నడ స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న అన్నదాన శిబిరాన్ని పరిశీలించారు. దాతలు నిర్వహిస్తున్న అన్నదానానికి దేవస్థానం తరుపున పూర్తి సహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అక్కడి అన్నదానానికి దేవస్థానం తరపున పాలు, మజ్జిగను అందజేయాలన్నారు.
కాగా అక్కడి అన్నదాన నిర్వహణకు దేవస్థానం చలువపందిళ్లతో పాటు తాత్కాలిక విద్యుద్దీకరణను కూడా ఏర్పాటు చేసింది.
ఇక కైలాసద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా కైలాసద్వారం వద్ద భక్తులు కొబ్బరికాయలను సమర్పించే ప్రదేశములలో తగు పారిశుద్ధ్య ఏర్పాట్లు వుండాలన్నారు.
ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్యనిర్వహణాధికారి వారు కాలిబాటతో వచ్చే పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించారు. కాలిబాటలోని ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు అందరు కూడా ఆయా ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ శ్రీస్వామిఅమ్మ వార్లను దర్శించుకోవాలని కూడా భక్తులకు సూచించారు.
ఈ ఏర్పాట్ల పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పీ మురళీబాలకృష్ణ, ఎం నరసింహారెడ్డి, పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి బీ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పీవీ సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.