నార్కట్పల్లి, ఆగస్టు 13: ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతో మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో విజయవాడ హైవేపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. దీంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లింగోటం గ్రామ శివారులోని సత్యదుర్గ గ్రానైట్ కంపెనీలో లోడు చేసుకున్న లారీ.. లింగోటం గ్రామం సబ్ రోడ్డు నుంచి 65వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న డీసీఎం వాహనం లారీని ఢీకొట్టింది. అతివేగంగా డీజిల్ ట్యాంక్ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెంది రెండు వాహనాలకు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే వాహనాలు చాలావరకు కాలిపోయాయి. రెండు వాహనాల డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.