బచ్చన్నపేట/పాలకుర్తి రూరల్/పటాన్చెరు, జనవరి 1: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం నోవపాన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలీంపూర్కు చెందిన పాకాల నితిన్ (18), పాలకుర్తి మండలం రాఘవపురానికి చెందిన రాగం భరత్చందర్ (19) అక్కడిక్కడే మృతిచెందారు. ఖమ్మం జిల్లాకు చెందిన వంశీ తీవ్రంగా గాయపడ్డాడు.