ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో (Dahegaon) విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. బుధవారం దహేగాం మండలంలోని పెసర కుంట పెద్ద వాగుకు వరద పోటెత్తింది. దీంతో సహాయ చర్యల కోసం సింగరేణి సంస్థ రెస్క్యూ బృంధాన్ని పంపించింది. అక్కడ ఇద్దరు కార్మికులు ఓ గర్భిణీని వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు జారి గల్లంతయ్యారు.
విషయం తెలుసుకున్న అధికారులు గల్లంతైన సతీశ్, రాము కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారి మృతదేహాలను కనుగొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గ్రామానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి వెళ్లినవారు.. మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.