ఎల్కతుర్తి, జనవరి 4: వారిది నిరుపేద కుటుంబం. వారి ఇద్దరు చిన్నారులు జన్యుపరమైన సమస్యతో జన్మించారు. తమ పిల్లల వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేశారు. అందిన చోటల్లా అప్పులు చేశారు. ఇప్పుడు దాతల ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటకు చెందిన ఉప్పుల సంధ్యారాణి-విశ్వం దంపతులకు నాలుగేండ్ల కిందట వివాహమైంది. తొలి సంతానం పాప (3) జన్మించింది. పుట్టుక నుంచి ఆ చిన్నారి జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నది. ఆమెకు వైద్యం చేయించడానికి ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేశారు. ఇక రెండో సంతానంగా 7 నెలల క్రితం జన్మించిన బాబు కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడు.
ఈ ఇద్దరు పిల్లలు.. మెదడు ఎదుగుదల లేకపోవడం, కాళ్లు, చేతులు పనిచేయకపోవడం, మాటలు రాకపోవడం, కూర్చోలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ వ్యాధి.. ఈ పేద దంపతుల ఇద్దరు పిల్లలకు రావడంతో వారు కుంగిపోతున్నారు. ప్రస్తుతం వీరికి హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ చిన్నారులకు ఇప్పుడు ఇంజక్షన్లు వేయాలని, ఒక్కో ఇంజక్షన్ రూ. 1.30 లక్షలు ఖర్చవుతుందని, ఇలా ఆరు నుంచి ఎనిమిది ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్టు ఆ దంపతులు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.5 లక్షల వరకు ఖర్చు చేశామని, అంత డబ్బు పెట్టి ఇంజక్షన్లు వేయించే స్థోమత తమకు లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం లేదా దాతలు తమ పిల్లల వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, ఎలాగైనా తమ పిల్లలను బతికించాలని ఆ వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయాలనుకునే వారు 9652026750, 6302852414 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు.