Congress | తిరుమలాయపాలెం/సిరిసిల్ల రూరల్, మే 2: కాంగ్రెస్లో రోజురోజుకూ వర్గ విభేదాలు తీవ్రమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల తరుణంలో అవి మరింత తీవ్రరూపం దాల్చి ఘర్షణలకు దారితీస్తున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం ఓ నాయకుడు మరో నాయకుడిని చెప్పుతో కొట్టినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రచారసభలో ఇద్దరు నేతల మధ్య వాగ్యుద్ధం తీవ్ర రభసకు దారితీసింది.
సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లిలో గురువారం కాంగ్రెస్ నేత వైద్య శివప్రసాద్ నివాసంలో కార్యకర్తలు సమావేశం అయ్యారు. రెండురోజుల క్రితం కాంగ్రెస్లో చేరిన ఇందిరమ్మకాలనీ మాజీ సర్పంచ్ బైరి రమేశ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన్ను చూసిన వెంటనే అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత మధుకర్ ఆగ్రహంతో ఊగిపోయి, రమేశ్పై చెప్పు తో దాడి చేసినట్టు సమాచారం.
ఖమ్మం జిల్లా దమ్మాయిగూడెంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేశ్రెడ్డి, బీరోలు మాజీ ఉప సర్పంచ్ మిర్యాల విక్రమ్రెడ్డి వర్గీయుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. విక్రమ్రెడ్డిని వేదికపైకి పిలవాలని ఆయన వర్గీయులు నినాదాలు చేయడంతో మంత్రి వేదికపైకి ఆహ్వానించారు.
దీంతో రామసహాయం నరేశ్రెడ్డి.. ‘వాడు పైకి వస్తే నేను వెళ్లిపోతా.. వాడు ప్రసంగించడానికి వీల్లేదు..’ అని తెగేసి చెప్పారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి పంచన ఉన్న వాళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్లో చేరి నాయకులమంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. వైరివర్గాల నినాదాలతో సభలో గందరగోళం నెలకొన్నది. ముగ్గురు కార్యకర్తలను పోలీసులు పోలీస్స్టేషన్కు తరలించారు.