TS Assembly | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల్లో రెండింటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి మండలి సోమవారం ఆమోదించింది. వీటిలో పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్దేశించిన గడువును మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు పెంచాలన్న బిల్లుతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఉన్నాయి.
ఇప్పటికే ఆమోదించిన ఈ రెండు బిల్లులను చాలా కాలం క్రితమే గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అయినా వాటికి మోక్షం లభించకపోవడంతో మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.