చిన్నకోడూర్ : రెండు వరుసల రింగురోడ్డు సిద్దిపేటకు వరం. రింగు రోడ్డు సిద్దిపేట మెడలో హారంలా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఆర్అండ్ బీ రింగు రోడ్డు నిర్మాణ పనులకు జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..20ఏండ్ల క్రితం సిద్దిపేట నియోజకవర్గంలో బుస్సాపూర్ నుంచి తిమ్మాయిపల్లి వరకు సింగిల్ రింగురోడ్డును ఆనాడే కేసీఆర్ వేయించారు. సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లనే నేడు ఇది సాధ్యమైందని మంత్రి తెలిపారు.
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా సిద్దిపేటకు రావాల్సిన అవసరం లేకుండా.. ఈ రెండు వరుసల రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. మొత్తం 88 కిలో మీటర్ల మేర రూ.160కోట్లతో రింగురోడ్డు వేస్తున్నాం. ఈ రింగురోడ్డు వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు.
7 మండలాలైన కొండపాక, తొగుట, దుబ్బాక, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూర్, నంగునూరు పరిధి మీదుగా 88 కిలో మీటర్ల మేర రింగురోడ్డును నిర్మిస్తామన్నారు. ఈ రింగురోడ్డును 12 గ్రామాలు బుస్సాపూర్, పుల్లూరు, మల్యాల, గంగాపూర్, మాచాపూర్, చిన్నకోడూర్, రామునిపట్ల, గోనెపల్లి, ఓబులాపూర్, పాలమాకుల, వెంకటాపూర్, బందారం గ్రామాల మీదుగా నిర్మిస్తామన్నారు
దేశంలో అన్ని ప్రభుత్వాలు రైతుల వద్ద శిస్తు వసూలు చేస్తే.. రైతులకే పన్ను కట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. నీటి తీరువాను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెట్టమని రైతుల మెడకు ఉరితాడు పెడుతున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బాయికాడ మీటర్లు పెట్టి 4 శాతం FRBM నిధులు తెచ్చుకున్నది.
కానీ తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం సీఎం కేసీఆర్ FRBM కింద తెలంగాణకు వచ్చే రూ.25 వేల కోట్లు వద్దనుకుని, రైతుల ప్రయోజనాలు ముఖ్యమని తేల్చిచెప్పారని స్పష్టం చేశారు.
బీజేపీ దురాగాతాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనలేదు. కానీ తెలంగాణ ప్రజలను నూకలు తినమని పరిహాసం చేసిందని కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు టింగ్ టింగ్ మని ఫోన్లు మోగుతూ పడుతుంటే రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతుందని మంత్రి తెలిపారు.