హనుమకొండ: జిల్లాలోని శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం ఉదయం కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
బాధితులంతా పత్తిపాక గ్రామానికి చెందినవారని వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆటోలో 25 మంది మహిళా కూలీలు ఉన్నారని చెప్పారు. వారంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో మిర్చి తోట ఏరడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.