గంభీరావుపేట, సెప్టెంబర్ 8: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన ఇద్దరు రైతులు పంట పొలాల వద్దకు వెళ్లి నాలుగు రోజులుగా అక్కడే చిక్కుకుపోగా, శుక్రవారం సాయంత్రం డీఆర్ఎఫ్ బృందాలు వారిని క్షేమంగా తీసుకువచ్చాయి. గ్రామానికి చెందిన అల్లాడి రాజం, మెతుకు ఎల్లయ్య గ్రామ శివారున మానేరువాగు గుడి గడ్డ వద్ద తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇక్కడ మానేరు వాగు రెండు పాయలుగా చీలి ఉండటం.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాగు ప్రవాహం ఎక్కువ కావడంతో వారు అక్కడే చిక్కుకున్నారు.
ఈనెల 4న ఉదయం పొలాలకు వెళ్లిన ఆ ఇద్దరు రైతులు సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పొలానికి రెండు వైపుల నుంచి వాగులు ఉధృతంగా పారుతుండటంతో అక్కడే ఉండిపోయారు. పొలం వద్ద ఉన్న గుడిసెలో నిత్యావసర సరుకులు ఉండటంతో వంట చేసుకొని ఆహారం తీసుకొన్నారు. 4 రోజులైనా వాగు ఉధృతి తగ్గక, తీసుకెళ్లిన సరుకులు అయిపోవడంతో ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులు శుక్రవారం అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ భూపతి, ఎస్సై మహేశ్, సర్పంచ్ శెట్టి మహేశ్వరి, ఎంపీటీసీ రాజేందర్ అక్కడికి చేరుకోగా డీఆర్ఎఫ్ బృం దం సభ్యులు రంగంలోకి దిగి తాళ్ల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. రైతులు క్షేమంగా ఇంటికి చేరడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.