మిరుదొడ్డి/నర్సింహులపేట, ఏప్రిల్ 7: సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. అందుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ (48) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తొగుటలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూమి పోవడంతో మిరుదొడ్డి మండలంలోని కాసులాబాద్లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఎప్పటి మాదిరిగానే ఈసారి యాసంగి సీజన్లో 4 ఎకరాల్లో వరి వేశాడు.
భూగర్భ జలాలు అడుగంటి పోయి వేసిన వరి పంటకు సాగునీరు అందకపోవడంతో వరి పూర్తిగా ఎండు ముఖం పట్టింది. కూతురి పెండ్లి చేయడంతోపాటు ఎవుసానికి అప్పులు అయ్యాయి. వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందిన ఆయన శనివారం కాసులాబాద్లోని పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానిక రైతులు శ్రీనివాస్ను చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. మృతుడికి భార్య సుజాత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్లాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రచకృతండాకు చెందిన జాటోత్ శ్రీను (40) మూడున్నర ఎకరాల మిరప, రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. మిరప సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. పంటకు చీడపీడలతోపాటు సాగునీరు లేకపోవడంతో నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అంతేగాక సాగునీరు లేక పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. నాలుగు క్వింటాళ్లు కూలీలకు కూడా సరిపోవని, అప్పులు ఎలా కట్టాలని దిగులు చెందాడు. అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈనెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య మాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మా బాబాయికి వ్యవసాయం అంటే ఇష్టం. పిల్లలను బాగా చదివించాలనే కోరికతో ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తున్నడు. మూడున్నర ఎకరాల్లో మిరప తోట వేశాడు. దురదృష్టవశాత్తు నాటిన కొన్ని రోజులకే మొక్కలు చనిపోయాయి. మళ్లీ మిరప మొక్కలు నాటాడు. ఏపుగా వచ్చింది. గుబ్బ రోగం సోకింది. పంటను కాపాడుకునేందుకు ఎన్నో మందులు పిచికారీ చేశాడు. అయినా పంట చేతికి రాలేదు. అప్పులు ఎక్కువ కావడంతో ఇబ్బందిపడ్డాడు. పత్తి పంటకు పురుగుపట్టింది. పంట పెట్టుబడి కోసం రూ.5 లక్షలతోపాటు గతంలో ఉన్న రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షలు అప్పు ఉండటంతో పంటలు పండక పోవడంతో బాధ పడుతుండేవాడు. ఎప్పుడు చూసిన అప్పులు ఎట్లా తీర్చిలాని బాధ పడేవాడు. నీళ్లు లేక యాసంగి పంటలు వేయలేదు. ఇలా పానం తీసుకుంటడని అనుకోలే. మా బాబాయి కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి.
– జాటోతు రమేశ్ ఎర్ర చకృతండా (మృతుడి అన్న కొడుకు)