దుబ్బాక/బోథ్, మార్చి 18 : అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేసినా చుక్క నీరు రాక సిద్దిపేట జిల్లాలో ఒకరు, దిగుబడి రాదేమోననే ఆందోళనతో ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లికి చెందిన రెడ్డి మోహన్రెడ్డి (40) తనకున్న రెండెకరాల్లో పంటలు సాగుచేశాడు. ఖాళీ సమయంలో కూలి పనులు చేస్తూ కుటుంబానికి పోషించుకుంటున్నాడు. పొలంలో ఇటీవల రెండు బోరు బావులు తవ్వించినా చుక్క నీరు రాలేదు.
వేసిన వరి పంట నీరులేక ఎండిపోవడంతో మానసికంగా కలత చెందాడు. అప్పటికే రూ.6 లక్షల అప్పులు ఉన్నాయి. వీటిని తీర్చే మార్గం లేక తీవ్రంగా కుంగిపోయాడు. మోహన్రెడ్డి బుధవారం వేకువజామున పొలం వద్దకు వెళ్లి ఒడ్డు పక్కన గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు దుబ్బాక ఎస్సై కీర్తిరాజు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన రైతు ఎడ్మల రత్నాకర్రెడ్డి(40) తనకున్న 13 ఎకరాల్లో మక్కజొన్న, గోధుమ సాగు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి రాలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబీకులు బోథ్లోని సివిల్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్లోని రిమ్స్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రత్నాకర్రెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పురుషోత్తం తెలిపారు.