నల్లగొండ: నల్లగొండ జిల్లా వేములపల్లి (Vemulapally) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం (Annapureddy Gudem) స్టేజి వద్ద మిర్యాలగూడెం (Miryalaguda) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ప్రైవేటు బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన బస్సు.. బైకును ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని మిర్యాలగూడ దవాఖానకు తరలించారు.
బస్సు బురద పొలంలో కూరుకుపోయింది. దీంతో ప్రయాణికులు కష్టంగా బయటకు వచ్చారు. క్రేను సహాయంతో బస్సును బయటకు తీశారు. మృతులను ఛత్తీస్గఢ్కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.