నిజామాబాద్: జిల్లాలోని బాల్కొండ (Balkonda) శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ శివారులో ఉన్న కిసాన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కంటైనర్ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
మృతులను హర్యానాకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. యాక్సిడెంట్కు గురైన లారీలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.