హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన ఇద్దరు రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్ట్స్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. మంగళవారం వచ్చిన నివేదికల్లో ఆ ఇద్దరికీ కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ఉస్మానియా వైద్యులు తొలుత ఒక మరణాన్ని మాత్రమే నిర్ధారించారు.
మీడియా పదేపదే సంప్రదించగా.. మంగళవారం రాత్రి రెండో మరణాన్ని కూడా ధ్రువీకరించారు. అయితే వీరు ఇతర అనారోగ్య సమస్యలతో మరణించినట్టుగా ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రకటించారు. హైదరాబాద్ పాతబస్తీలోని దూద్బౌలి ప్రాంతానికి చెందిన ఎండీ సుభాన్(60) ఈ నెల 14న ఎడమ జఠరిక, తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉస్మానియాలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 21న సుభాన్కి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. కిషన్బాగ్కు చెందిన మహ్మద్ యూసుఫ్ (42) కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఈ నెల 20న ఉస్మానియాలో చేరారు. ఆయనకు 22న కరోనా పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందుతూ యూసుఫ్ అదే రోజు మరణించారు.
వీరిద్దరికి సంబంధించిన కరోనా పరీక్షల నివేదికలు మంగళవారం వచ్చాయి. ఇద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరితోపాటు ఇటీవల ఉస్మానియాలో చేరిన వికారాబాద్ జిల్లా ధరూర్కు చెందిన ఎన్ పార్వతమ్మ (61), రాజేంద్రనగర్కు చెందిన ఏళ్ల పల్లె లక్ష్మణ్ (36), మల్లేపల్లికి చెందిన ఎండీ హఫ్సా బేగం (12)కు కరోనా పాజిటివ్గా తేలింది. వీరు ప్రస్తుతం దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. అయితే, జేఎన్1 వేరియంట్ వైరస్ తేలికపాటిదేనని, ప్రజలు భయపడాల్సిన అవసరంలేదని డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు వివరించారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. అధికార యంత్రాంగంలో అప్రమత్తత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిలోఫర్లో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్గా తేలడంతో వెంటనే వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించి, వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టారు. కానీ ఉస్మానియాలో మరణించిన వారి విషయంలో అలాంటి చర్యలు కనిపించడం లేదు. వారి కుటుంబసభ్యులకు, ప్రధాన కాంటాక్టు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
ఉస్మానియా దవాఖానలో కరోనా వ్యాప్తి విస్తృతం అవుతున్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు కొన్నిరోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. వారికి దవాఖానలోనే వ్యాధి సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా దవాఖానలో ఇద్దరు వైద్యులతోపాటు మరికొందరు పారిశుద్ధ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని తెలుస్తున్నది. దీనిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించడం లేదు. ఈ నేపథ్యంలో వివరాలు బయటకు పొక్కకుండా తీసుకునే జాగ్రత్తల కంటే వైరస్ వ్యాప్తిని నియంత్రించడంపై దృష్టిసారిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఎనిమిది కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 59 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులన్నీ హైదరాబాద్లోనే నమోదయ్యాయని పేర్కొన్నది. కాగా, మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానలో మంగళవారం 14 మంది పరీక్షలు చేయించుకోగా.. ఒకరికి పాజిటివ్గా వచ్చిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలి కొవిడ్ మరణం ఉస్మానియా దవాఖానలో చోటు చేసుకున్నదనే వార్త దావానంలా వ్యాపించడంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్తో ఫోన్లో చర్చించారు. మృతి చెందిన రోగుల ఆరోగ్య పరిస్థితి, ఎలా మరణించారనే అంశాలపై నివేదిక సమర్పించాలని కోరినట్టు తెలుస్తున్నది.