హైదరాబాద్: ప్రజాపాలన (Prajapalana) సదస్సులు రెండు రోజులపాటు నిలిచిపోనున్నారు. ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ఈ రెండు రోజులు అధికారులు అభయహస్తం (Abhaya Hastham) దరఖాస్తులు స్వీకరించరు. మంగళవారం నుంచి మళ్లీ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. జనవరి 6న ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ఈ నెల 28న ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకంతోపాటు రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 40,57,592 దరఖాస్తులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో తొలిరోజు నుంచే గందరగోళం నెలకొన్నది. దరఖాస్తులోని అంశాలపై స్పష్టత కొరవడంతో ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని అధికారులు తీర్చలేకపోవడంతో పలుచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా జిరాక్స్ సెంటర్ల యజమానులు ఒక్కో దరఖాస్తు ఫారం జిరాక్స్ తీసేంకు రూ.30 నుంచి రూ.100 వరకు కూడా వసూలు చేస్తున్నారు.