కరోనాలో ‘మీ కోసం నేనున్నా’
నిరుపేదల ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, మే 2 :ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, కరోనా నేపథ్యంలో కూడా మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జనం బయటకు అడుగు వేయాలంటేనే జంకుతున్నారని, ఈ సమయంలో ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమంలో ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ తమ సమస్యలను వివరించారని తెలిపారు. మెదక్ పట్టణంలోని ఇందిరాపూరి కాలనీలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ప్రజలు తమ అర్జీలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి నెలా 2, 16 తేదీల్లో మెదక్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 16వ తేదీన మీ కోసం నేనున్నా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. కరోనాను అరికట్టేందుకు పట్టణ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలను మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూసివేయడం అభినందనీయమన్నారు.
పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్..
టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలతో వారిని ఆర్థికంగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెద క్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ పట్టణం, మె దక్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.లక్షా116 చొప్పున కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
సర్వమతాలను సమానంగా చూస్తున్న సర్కారు..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సర్వమతాల పండుగలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ పట్టణానికి చెందిన ముస్లిం కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఆర్డీవో సాయిరాం, కౌన్సిలర్లు సమీయొద్దీన్, జయరాజ్, వసంత్రాజ్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, అశోక్, మధు పాల్గొన్నారు.