Karimnagar | కరీంనగర్ : కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు. కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన అవవేని మల్లేశం, పోశవ్వ ఉపాధి నిమిత్తం కరీంనగర్కు ఏడేండ్ల క్రితం వలసొచ్చారు. కరీంనగర్లోని వావిళ్లపల్లిలో వీరు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అశ్రిత్, అర్చన ఉన్నారు. వీరి వయసు 15 ఏండ్లు. కాగా ఇద్దరు కూడా మానసిక వికలాంగులు.
అయితే నిన్న సాయంత్రం తల్లి మార్కెట్కు వెళ్లిన సమయంలో తండ్రి పిల్లలపై దాడి చేసి చంపేందుకు యత్నించాడు. అపస్మారకస్థితిలో ఉన్న పిల్లలిద్దరిని చికిత్స నిమిత్తం కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అర్చన ప్రాణాలు కోల్పోగా, అశ్రిత్ చికిత్స పొందుతున్నాడు.
మానసిక వికలాంగులైన ఇద్దరు పిల్లల ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే వారిని చంపేందుకు యత్నించి ఉండొచ్చన్నారు. ఏదైనా విషపదార్థం ఆహారంలో కలిపి ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్లేశం పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.