హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖలో రెండు అడిషనల్ డైరక్టర్ పోస్టులను మంజూరు చూస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్లో జరిగింది. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో మంత్రివర్గం పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం తొమ్మిదినుంచి పది క్లస్టర్లను ఎంపిక చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించాలని కేబినెట్ ఆదేశించింది.
రాష్ట్రంలోని రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలని, రైతు శిక్షణా కార్యక్రమాలను నిరంతరం జరపాలని, రైతుబంధు సమితి సంఘాల అధ్యక్షులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఇందులో పాల్గొనాలంది. ఏఈవో, డీఏవోలు, వ్యవసాయశాఖ అధికారులు రైతు వేదికలను కేంద్రంగా చేసుకోని వ్యవసాయశాఖ విధులను పర్యవేక్షించాలంది. రైతులతో నిరంతరం సమావేశమైతుండాలని కేబినెట్ సూచించింది. రైతులకు వానాకాలంలో వరి, కంది, పత్తి పంటల సాగు గురించి అవగాహన కల్పించాలని కేబినెట్ ఆదేశించింది. వరి నాట్లు కాకుండు వెదజల్లే పద్దతిని అవలంబించాలని రాష్ట్ర రైతాంగానికి కేబినెట్ పిలుపునిచ్చింది.