Aasara Pensions | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ మోకాళ్ల యాత్ర చేపట్టినా ఆ పార్టీ అధికారంలోకి రాదని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. అచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలే అని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారన్నారు.
రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని, పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ, ఆ పార్టీని ప్రజలు నమ్మలేదని వాసుదేవ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగకముందే దివ్యాంగులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించి అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. దివ్యాంగులకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.