Telangana Elections | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కడపటి సమాచారం అందే సమయానికి 70.61 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. తుది పోలింగ్ శాతం వివరాలను శుక్రవారం మధ్యాహ్నం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఓట్లు వేసేందుకు ప్రజలు ఉదయం ఏడు గంటలకే పోలింగ్కేంద్రాల వద్ద బారులుతీరారు.
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల తరువా త కూడా ప్రజలు క్యూలైన్లలో కనిపించారు. వారందరికి ఓటు హక్కు కల్పించారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న 16 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ను సాయంత్రం నాలుగు గంటలకే ముగించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గంలో అత్యధికంగా 91.51 పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత పాలేరులో 90.28 శాతం, ఆలేరులో 90.16 శాతం పోలింగ్తో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఎప్పటిలాగే హైదరాబాద్ ఓటర్లు పోలింగ్పై నిరాసక్తత ప్రదర్శించారు. హైదరాబాద్లోని యాకత్పురాలో అత్యల్పంగా 39.69 శాతం నమోదైంది. దివ్యాంగులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్ అవుటర్ రింగ్రోడ్డుకు ఆవల ఉన్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. నగరాలు, పట్ణణ ప్రాంతాలైన హైదరాబాద్ సహా ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్లో మాత్రం పోలింగ్ తక్కువగా నమోదు అయింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ఓట్లు గల్లంతయ్యాయన్న ఆందోళనలు, ఫిర్యాదులు పెద్దగా లేకపోవడం విశేషం. హైదరాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా పాతబస్తీలో అతి తక్కువగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ శాతం ఓట్లు పోలైనట్టు తెలుస్తున్నది. తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గ్రామీణవాసులు బుధవారం నాడే హైదరాబాద్ నుంచి తమ గ్రామాలకు తరలి వెళ్లడం ప్రారంభించారు. జాతీయ రహదారులు కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడింది.
పోలింగ్ సామగ్రితో సిబ్బంది బుధవారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు వార్తలు వచ్చాయి. వాటిని వెంటనే మార్చటం లేదా మరమ్మతు చేశారు. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం, జాప్యం, ఓటర్ల ఓపికకు పరీక్ష పెట్టాయి. దీంతో అనేక మంది ఓటర్లు ఎన్నికల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీఆర్కేఆర్ భవన్ నుంచి ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్, అదనపు సీఈవో సర్ఫరాజ్ అహ్మద్లు నిత్యం వెబ్క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, ఈవీఎంల సమస్యలను పరిశీలిస్తూ.. వాటికి ఎప్పటికప్పుడు పరిష్కారం చూపారు. 27 వేల పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ సరళిని నగర మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రోస్ ద్వారా తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో రేవంత్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ నివేదిక కోరినట్టు తెలిసింది.
పలు నియోజకవర్గాల్లో పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగింది. ఓటు వేయడానికి సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని రావడం, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి ఓటర్లు తరలిరావడంతో.. వీరంతా పోలింగ్ కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో సత్తుపల్లి సహా పలు నియోజకవర్గాల్లో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగింది. 2018 ఎన్నికల్లో 73.37 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి రాత్రి వరకు పోలింగ్ జరిగినందున ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
పోలింగ్ జరిగే రోజున రాజకీయాలు మాట్లాడవద్దనే నిబంధన ఉన్నా.. కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి మీడియాతో రాజకీయాలు మాట్లాడటంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై క్షేత్రస్థాయి ఎన్నికల అధికారుల ద్వారా నివేదిక తెప్పించుకుంటున్నారు. కామారెడ్డిలో రేవంత్రెడ్డి తమ్ముడు తిరుమల్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారని, దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరారు.