హైదరాబాద్ : అతని రెక్కాడితే గానీ ఆ కుటుంబం డొక్క నిండదు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ఆ కుటుంబ యజమాని పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలే జీవితంగా బతుకుతున్న ఆ వ్యక్తి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. రోజు రోజుకు గుండెలో తీవ్రమైన నొప్పి రావడం, దగ్గుతో బాధపడుతున్న అతను నిమ్స్ వైద్యులను సంప్రదించాడు. అతన్ని పరీక్షించిన నిమ్స్ వైద్యులు గుండె మార్పిడి చేయాలని, అందుకు రూ. 25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వం పూర్తి ఉచితంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించింది. అంతేకాదు.. గుండె కావాలని జీవన్దాన్లో పేరు నమోదు చేసుకున్న మరుసటి రోజే ఆ పెయింటర్కు గుండె లభించింది. అటు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం.. ఇటు ఒక్క రోజులోనే గుండె లభించడం.. వరుసగా జరిగిపోయాయి. మొత్తంగా పెయింటర్కు గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి అతని ప్రాణాలను కాపాడారు నిమ్స్ వైద్యులు.
తాను పునర్జన్మ పొందిన రోజే తన నిజమైన పుట్టిన రోజుగా భావించిన హుస్సేన్.. ఇవాళ నిమ్స్లో బర్త్ డే వేడుకలను నిర్వహించుకుని కృతజ్ఞత చాటుకున్నాడు. హుస్సేన్కు గతేడాది నిమ్స్ వైద్యులు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి అతన్ని ప్రాణాలను కాపాడారు. ఈ నేపథ్యంలో తనకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు, గుండెను అందించిన జీవన్ దాన్ సభ్యుల సమక్షంలో హుస్సేన్ కేక్ కట్ ,చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హుస్సేన్కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పునర్జన్మ ప్రసాదించిన నిమ్స్ ఆసుపత్రిలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న హుస్సేన్ కు జన్మదిన శుభాకాంక్షలు. నిమ్స్ వైద్యులు గతేడాది ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి ఉచితంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి ప్రాణదానం చేశారు అని హరీశ్రావు తన ట్వీట్లో పేర్కొన్నారు. తాను పునర్జన్మ పొందిన రోజే తన నిజమైన పుట్టిన రోజుగా భావించిన హుస్సేన్.. వైద్యులు, జీవన్ దాన్ ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పేదలకు ఖరీదైన స్పెషాలిటీ సేవలు చేరువయ్యాయని హరీశ్రావు పేర్కొన్నారు.
హైదరాబాద్ కొండాపూర్ స్పెషల్ బ్రాంచిలో కానిస్టేబుల్గా పని చేస్తున్న వీరబాబు.. గతేడాది సెప్టెంబర్ 12న గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. వీరబాబు బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు ప్రకటించగా, అతని గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఇదే సమయంలో గుండె కావాలని జీవన్దాన్లో పేరు నమోదు చేసుకున్న హుస్సేన్కు.. కానిస్టేబుల్ గుండెను నిమ్స్ వైద్యులు అమర్చారు. హైదరాబాద్లోని మలక్ పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా గుండెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.