హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేదని, కానీ రాష్ట్ర విభజనతో అది విజయవాడకు మార్చినట్టు తెలిపారు. దీంతో తెలంగాణలోనూ అవసరాలకు అక్కడి నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో 27 జిల్లాల్లో మొత్తం 2,233 ఎకరాలలో కొబ్బరి సాగు అవుతుండగా సాలీనా 94.92 లక్షల కాయల ఉత్పత్తి జరుగుతున్నదని, ప్రదానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,358 ఎకరాలలో, ఖమ్మం జిల్లాలో 586 ఎకరాలలో కొబ్బరి సాగవుతున్నది వివరించారు. అన్ని జిల్లాలలో ఎకడైనా కొబ్బరి సాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తరణ, అభివృద్ది వేగంగా జరుగుతాయని పేర్కొన్నారు.