హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ నీటితో సాగు చేసే, వర్షాభావాన్ని తట్టుకునే పంటలపై గ్రామసభల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పంట వ్యర్థాలు కాల్చినవారిని గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. రూ.2,284.32 కోట్లతో కొహెడలో నిర్మిస్తున్న పండ్ల మార్కెట్కు సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు.
వ్యవసాయ శాఖలో ఉద్యోగోన్నతులను మంజూరు చేస్తూ పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరించడంపట్ల అగ్రి డాక్టర్స్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి తుమ్మలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు రైతులకు చేరువయ్యేలా చూస్తామని చెప్పారు. అనంతరం సంఘం సభ్యులు ఏపీసీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఫౌండర్ రాములు, అధ్యక్షుడు సాల్మన్ రాథోర్, సెక్రటరీ తిరుపతినాయక్, డీడీఏలు శోభారాణి, దామోదర్, శ్రావణ్, సుధాకర్, నీలిమ, వెంకటేశ్వర్లు, మేరి రేఖ, చంద్రకళ, రామారావునాయక్ తదితరులు పాల్గొన్నారు.