వనపర్తి : వైద్యుల సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే క్షయ వ్యాధి నయం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తిలోని పెబ్బెరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 42 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు తన సొంత డబ్బులతో నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.వనపర్తి నియోజకవర్గంలో 385 మందికి గుడ్లు, నిత్యావసరాలుప్రతి నెలా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పంపిణీ చేస్తున్నామని వివరించారు.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితేనే క్షయ వ్యాధి దూరమవుతుందని అన్నారు. మాంసం తింటేనే బలం వస్తుందనే ఆపోహాలు మానుకోవాలని సూచించారు. కంది పప్పు, గుడ్డు, ఆకుకూరలలోనూ మాంసకృత్తులు ఉంటాయని వెల్లడించారు. ఆరు నెలల చికిత్స సమయంలో వ్యాధిగ్రస్తులు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నయం అవుతుందని అన్నారు.
క్షయ సోకిందని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిత్యావసరాల కిట్ లో నెలకు 5 కిలోల సన్నబియ్యం, 2 కిలోల మంచినూనె, ఒక కిలో కందిపప్పు, 30 గుడ్లను అందజేస్తున్నామని అన్నారు.