హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటు సుప్రభాత సేవలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బ్రేక్ దర్శనాల సమయాల్లో చేసిన మార్పులను మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వీఐపీ సిఫార్సు లేఖలను వారాంతంలో మూడు రోజులపాటు స్వీకరించడం లేదని పేర్కొన్నారు. ఘాట్రోడ్డులో ప్రమాదాల నివారణకు చెక్ పాయింట్స్తోపాటు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నవీముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 600 కోట్ల విలువ చేసే స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, ఇక్కడ 100 కోట్లతో నిర్మించనున్న ఆలయానికి రేమండ్స్ అధినేత సింఘానియా దాతగా వ్యవహరిస్తారని ధర్మారెడ్డి పేర్కొన్నారు.