హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వెళ్లే కాలినడక దారిలో టీటీడీ ఆంక్షలను విధించింది. ఇటీవల చిన్నారిపై చిరుత దాడి ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అలిపిరి-తిరుమల నడకమార్గంలో 100 మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తరలించాలని నిర్ణయించింది. వారికి రక్షణగా ముం దు, వెనుకాల రోప్, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేస్తుంది. మధ్యాహ్నం 2 గంటల త ర్వాత 15 ఏండ్లలోపు బాలలకు అనుమతి నిలిపివేసింది. ఏడో మైలు వద్ద బాలల చేతికి పోలీసులు ట్యాగ్లు వేస్తారు. దానిపై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయి. పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ఈ ట్యాగ్లు వేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. మరోవైపు చిన్నారిపై దాడిచేసిన చిరుతను పట్టుకొనేందుకు ఫారెస్ట్ అధికారులు గా లింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆదివారం పరిశీలించారు.
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేపింది. శుక్రవారం చిరుత దాడిలో చిన్నారి మృతి ఘటనను మరువక ముందే ఆదివారం మరోసారి చిరుత సంచారం కంటపడింది. మధ్యాహ్నం నడకదారిలోని 2,450వ మెట్టు వద్ద చిరుత కనిపించింది. వెంటనే అటవీ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అది ఐదు చోట్ల సంచరించినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. 7వ మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ద్వారా 100 మంది చొప్పున భక్తులను దర్శనానికి అనుమతించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.